Harish Rao | బీర్లను, బార్లను నమ్ముకొని పాలన కొనసాగిస్తారా? మ‌ద్యం ధ‌ర‌ల పెంపుపై హ‌రీశ్‌రావు ఫైర్

Harish Rao

Harish Rao | హైద‌రాబాద్ : బీర్లను, బార్లను నమ్ముకొని పాలన కొనసాగిస్తారా? మద్యం అమ్మకాలు పెంచి ఖజానా నింపుకుంటారా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. ఎక్సైజ్ ఆదాయంలో తెలంగాణ రైసింగ్.. ఇదేనా మీరు చెప్పిన మార్పు రేవంత్ రెడ్డి? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

పాలన గాలికి వదిలి, సంక్షేమ పథకాలను అటకెక్కించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా ఎక్సర్ సైజ్ చేస్తున్న డిపార్ట్‌మెంట్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ఒక్కటే అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యంపై రాద్దాంతం చేసిన వాళ్లే, మద్యం ధరలు పెంచి వేల కోట్ల రాబడిని సమకూర్చుకోవాలనుకోవడం సిగ్గుచేటు అని మండిప‌డ్డారు.

ఇప్పటికే బీర్ల ధరలను 15 శాతం పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచి, పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నది. ఒకవైపు మద్యం ధరలు పెంచడం, మరోవైపు విక్రయాలను రెండింతలు చేయాలని అధికారులను ఆదేశించడంలోనే ప్రభుత్వం అంతర్యం స్పష్టమవుతున్నది. ఎన్నికల ముందు సుద్ద పూస మాటలు, అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మద్యం ధరల పెంపు అని హ‌రీశ్‌రావు విరుచుకుప‌డ్డారు.

దివాలా దివాలా అని దిక్కుమాలిన ప్రచారం చేసి రాష్ట్ర పరపతిని దిగజార్చారు. అనాలోచిత నిర్ణయాలు, దుందుడుకు చర్యల వల్ల రాష్ట్ర ఆర్థిక ప్రగతి రోజు రోజుకి క్షీణిస్తుండగా, ఆ లోటును భర్తీ చేసుకునేందుకు మద్యం ధరలు పెంచడం మీకే చెల్లింది అని ధ్వ‌జ‌మెత్తారు.

మద్యం నియంత్రణ విషయంలో మేనిఫెస్టో లో చెప్పిన ఒక్క హామీ అయినా ఇప్పటి వరకు అమలు చేశారా..? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. ఎక్సైజ్ విధానాన్ని పరిశీలించి, సవరణలు చేయడం అంటే ధరలు అడ్డగోలుగా పెంచడమేనా ముఖ్యమంత్రి గారూ.. ఇష్టారీతిన మద్యం ధరలు పెంచి, తాగుబోతుల ద్వారా ఖజానా నిలుపుకోవాలని చూస్తారా? రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేసి, మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో తెలంగాణను నెంబర్ 1 చేస్తారా? మీరు చెబుతున్న తెలంగాణ రైజింగ్ అంటే ఇదేనా? అని నిల‌దీశారు.

బెల్ట్ షాపులు మూస్తామని హామీ ఇచ్చి, గల్లి గల్లీలో బెల్ట్ షాపు తెరిచి తాగుబోతుల తెలంగాణగా మార్చే కుట్ర కాంగ్రెస్ చేస్తున్నది. ఒకవైపు ఎక్సైజ్ ద్వారా ప్రజల నుంచి డబ్బును ముక్కు పిండి వసూలు చేస్తూ, మరోవైపు ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు బడ్జెట్ లో సరైన కేటాయింపులు చేయలేదు. ఇచ్చేది ఎగబెడుతున్నరు. ఉల్టా ప్రజల నుంచి డబ్బులు లాక్కుంటున్నరు. ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే? ఇంకెన్ని సార్లు మద్యం ధరలు పెంచుతారు? ఇంకెన్ని కోట్లు ప్రజల నుండి దండుకుంటారు? ఇది చాలదన్నట్లు సర్కారు గల్లా పెట్టె ఫుల్లుగా నింపుకోవాటానికి గ్రామీణ జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 30 కిలో మీటర్లకు ఒకటి చొప్పున 100కు పైగా మైక్రో బ్రూవరీల ఏర్పాటు చేస్తున్నరట. ఇంతకంటే దిగజారుడు, దిక్కుమాలిన పాలన ఎక్కడైనా ఉంటుందా? రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేసి, భార్యా పిల్లలను రోడ్ల మీద పడేస్తారా? యువత బతుకులను ఆగం చేస్తారా? అసలు ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నది? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

Leave a Comment